ఏపీలో పోలీసుల బీమా పెంపు…
సెల్ఐటి న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు బీమా మరింతగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్లో పెరుగుదల కనిపించింది. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్గా చెల్లిస్తుండగా ఈసారి దానిని రూ.20లక్షలకు పెంచారు. అలాగే ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్ వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆ పైస్థాయి అధికారులకు రూ.45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.4.74 కోట్లను చెల్లించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్తోపాటు ప్రమాదవశాత్తూ పో
లీసులకు ఏదైనా జరిగితే దానికింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ.40 లక్షలు అందిస్తూ కొన్నిరోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో 64719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎంజగన్కు ధన్యవాదాలు తెలిపిన పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్…
పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేసింది. వారాంతపు సెలవుతో 64 వేల మంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని, అలాగే పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు, యాక్సిడెంటల్ పాలసీ విలువ కూడా పెంచి మరింత భరోసా నిచ్చిందని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని బుధవారం కలిసి ధన్యవాదాలు తెలిపారు.